అసోం: జైలు నుంచే జయభేరి మోగించిన అఖిల్ గొగోయ్!

ABN , First Publish Date - 2021-05-03T22:54:03+05:30 IST

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ...

అసోం: జైలు నుంచే జయభేరి మోగించిన అఖిల్ గొగోయ్!

శిబ్‌సాగర్: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన... ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందారు. గొగోయ్‌కు మొత్తం 57,219 ఓట్లు రాగా.. మొత్తం 46.06 శాతం ఓటర్ల మద్దతు ఆయనకు లభించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్‌‌ను అరెస్ట్ చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచినప్పటికీ... ఎన్నికల్లో మాత్రం సుభ్రామిత్ర గొగోయ్‌కు టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.


కాగా ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోవడంతో.. గొగోయ్ జైలు నుంచే ప్రజా సమస్యలపై అనేక బహిరంగ లేఖలు రాశారు. దీనికితోడు జైల్లో ఉన్న తన కుమారుడి కోసం 85 ఏళ్ల ఆయన మాతృమూర్తి ప్రియదా గొగోయ్... శిబ్‌సాగర్‌లోని ఇరుకిరుకు గల్లీల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. వృద్ధాప్య సమస్యలను సైతం పక్కనబెట్టి ఆమె చేస్తున్న పోరాటానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, సందీప్ పాండే మద్దతు తెలిపారు. శిబ్‌సాగర్‌కు తరలివచ్చి ప్రియదా గొగోయ్‌తో కలిసి ప్రచారం చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కొన్వర్‌ కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. స్థానిక బీజేపీ శ్రేణులతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి అగ్రనేతలను సైతం రంగంలోకి దించినా.. గొగోయ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.


గువాహటిలోని కాటన్ కాలేజి నుంచి పట్టభద్రుడైన 46 ఏళ్ల గొగోయ్.. ఎన్నికల రాజకీయాలకు కొత్తేం కాదు. 1995-96 మధ్య ఆయన కాటన్ కాలేజి స్టూడెంట్ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక ఏళ్లుగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) వేదికగా అనేక పోరాటాలకు నేతృత్వం వహించారు. 2019 డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం హింసకు దారితీయడంతో.. దీని వెనుక గొగోయ్ హస్తం ఉందంటూ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-05-03T22:54:03+05:30 IST