దేశ సమైక్యతను కాపాడుకుందాం
ABN , First Publish Date - 2022-08-11T06:05:52+05:30 IST
దేశ సమైక్యతను కాపాడుకుందామంటూ ఆజాదీ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం గొల్లపాలెంగట్టు ఆర్సీఎం స్కూల్ నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
దేశ సమైక్యతను కాపాడుకుందాం
ఫప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ
చిట్టినగర్, ఆగస్టు 10: దేశ సమైక్యతను కాపాడుకుందామంటూ ఆజాదీ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం గొల్లపాలెంగట్టు ఆర్సీఎం స్కూల్ నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కొత్తపేట పోలీస్స్టేషన్ సీఐ ఏ.సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. జాతీయ జెండాతో విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. పలువురు చిన్నారులు దేశ నాయకుల వేషధారణలో ప్రజలకు ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సీఐ ఏ.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలాలనే మనం అనుభవిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకోవాలన్నారు. కార్పొరేటర్ బీ.సత్యబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో దేశ ప్రజలందరూ ఐక్యమత్యంతో ఆర్థిక సామాజిక, సమానత్వం సాధించాలన్నారు. ర్యాలీలో అరుణ హైస్కూల్ ప్రిన్సిపాల్ జి.అప్పారావు, ఐద్వా 50 డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కే.వరలక్ష్మి, వీ.స్వప్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక నగర నాయకులు బీ.రవికుమార్, సీఐటీయూ నాయకులు బీ.రాము, స్థానిక న్యాయవాది పిళ్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కార్మికశాఖ ఆధ్వర్యంలో...
అజిత్సింగ్నగర్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బంది నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం ‘హర్ ఘర్ తిరంగా’ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.
రాజీవ్నగర్లో
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
పాయకాపురం: ఆజాదీ కా అమృత్ మహో త్సవ్లో భాగంగా రాజీవ్ నగర్లోని రాజీవ్గాంధీ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో బుధవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ జెండా ఊపి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్వాంతంత్య్ర ఉద్యమ నాయకుల చిత్రపటాలను, త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైసీపీ నేతలు మోదు గుల గణేష్, టెక్యం కృష్ణ, పాల్గొన్నారు.
జాతీయ నాయకుల వేషధారణలతో ...
భవానీపురం: స్థానిక నాలుగు స్థంభాల సెంటర్లోని నేషనల్ స్కూల్ విద్యార్థులు జాతీయ నాయకులు వేషధారణల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులు జాతీయ జెండాలతో కుమ్మరిపాలెం వరకు ప్రదర్శన నిర్వహించారు. నాలుగు స్థంభాల సెంటర్లో తొలుత మానవ హారం నిర్వహించారు. కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, గుడివాడ నరేంద్ర, సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు లాజర్, ప్రిన్సిపాల్ బి. ఉషారాణి పాల్గొన్నారు.
రిక్షా తొక్కుతూ...
భవానీపురం: గాంధీజీ కలలు కన్న నిజమైన స్వాతంత్ర్యాన్ని ఆశిస్తూ జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేయాలని గాంధీ దేశం ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్. నాగరాజన్ అన్నారు. ట్రస్ట్ కార్యాలయం నుంచి ఊర్మిళానగర్ మీదుగా కబేళా సెంటర్ పెట్రోల్ బంకు వరకు రిక్షా తొక్కుతూ మైక్ ద్వారా జాతీయ జెండా ఆవశ్యకతను ఆయన బుధవారం వివరించారు. సభ్యురాలు బి. భారతి, స్ధానిక ప్రజలు పాల్గొన్నారు.