పంటబీమా సొమ్ము రూ.174 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2022-06-13T06:05:30+05:30 IST
పంటబీమా సొమ్ము రూ.174 కోట్లు విడుదల
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : 2021 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు బీమాగా రూ.174 కోట్లు మంజూరైనట్లు కృష్ణ్ణాజిల్లా వ్యవసాయశాఖ అధికారి మనోహరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 29,949 మంది రైతులకు రూ.123.29 కోట్లు, కృష్ణాజిల్లాకు సంబంధించి 13,321 మంది రైతులకు రూ.50.71 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. పామర్రులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
వరి విత్తనాలు సిద్ధం
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాలో 6,650 క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు జేడీ మనోహరరావు తెలిపారు. ముందస్తుగా వరి నారుమళ్లు పోసే గన్నవరం, కంకిపాడు, పామర్రు, ఉంగుటూరు, ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, గుడ్లవల్లేరు తదితర మండలాల్లో వరి విత్తనాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. విత్తనాలు అవసరమైన రైతులు ఆయా మండలాల్లోని ఆర్బీకేలలో నగదు చెల్లించి తీసుకెళ్లొచ్చని చెప్పారు. కిలోకు రూ.5 చొప్పున సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. వాతావరణం అనుకూలంగా మారాక డిమాండ్కు తగ్గట్టుగా అందుబాటులో ఉంచుతామని జేడీ వివరించారు.