రివర్స్ పీఆర్సీ వ్యతిరేకిస్తూ ఉద్యోగుల రిలే దీక్షలు
ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST
రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె.శ్రీనివాసరావు ప్రారంభించారు.
వేతనాల బిల్లులు పెట్టాలని డీడీవోలపై
వత్తిడి చేయడాన్ని ఖండించిన నేతలు
ఒంగోలు(కలెక్టరేట్), జనవరి 27 : రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె.శ్రీనివాసరావు ప్రారంభించారు. సాధన సమితి నాయకులు కూచిపూడి శరత్బాబు, ఆర్వీఎస్ కృష్ణమోహన్, చిన్నపురెడ్డి కిరణ్కుమార్రెడ్డి, ఎండ్లూరి చిట్టిబాబుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇచ్చిన జీవోలను రద్దుచేయకుండా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు అంటూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఉద్యోగులు ఒకవైపు రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోకుండా వేతనాలు కొత్త పీఆర్సీతో చెల్లించాలని డీడీవోపై ప్రభుత్వం వత్తిడి తేవడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఇదేవిధంగా మొండిగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఐఆర్తో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విదానాన్ని రద్దుచేసి పాతపెన్షన్ విదానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు సుబ్బారావు, రోజ్కుమార్, షరీఫ్, ప్రసన్నకుమార్, కె.వెంకటేశ్వర్లు ఉన్నారు.