గోదావరికి మళ్లీ వరద
ABN , First Publish Date - 2022-08-17T06:23:58+05:30 IST
భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది.
వేలేరుపాడు సంతమార్కెట్లో ఇళ్లు మునక
వేలేరుపాడు/ కుక్కునూరు, ఆగస్టు 16 : భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి పోటెత్తుతోంది. దీంతో నీటిమట్టం పెరుగుతోంది. సోమవారం రాత్రి 9 గంటలకు 46.50 అడుగులు ఉన్న గోదావరి మంగళవారం ఉదయం 6 గంటలకు 49.10 అడుగులకు చేరింది. మంగళవారం రాత్రి 10 గంటలకు 53.20 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 40 రోజులుగా ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు గోదావరి వరదతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తగ్గుతుంది అన్న సమయంలో మరోసారి పెరుగు తుండటంతో గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 40 రోజుల వ్యవధిలోనే గోదావరి నదికి మూడోసారి వరద పోటెత్తడంతో గత వారంలో వచ్చిన వరదకే ఇంకా బయట పడని గ్రామాలు ప్రస్తుతం వస్తున్న వరదలకు మరోసారి ముంపునకు గురవుతున్నాయి. మంగళవారం సాయంత్రానికి వేలేరుపాడు మండలంలోని దాదాపు 35 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రికి 55 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గోదావరి పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. జూలైలో సంభవించిన వరదల కారణంగా గుట్టలపై చేరుకున్న ప్రజలు ఇంకా గుట్టలు దిగివచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకెంతకాలం ఈ వనవాసం అంటూ వారు ఆక్రోశిస్తున్నారు.