ఆర్టీసీ స్థలంలో పెద్దల పాగా

ABN , First Publish Date - 2022-05-23T04:58:03+05:30 IST

పట్టణంలోని బస్టాండు సమీపంలో ఆర్టీసీకి మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారికి ఆనుకుని కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో పెద్దలు పాగా వేశారు.

ఆర్టీసీ స్థలంలో పెద్దల పాగా
ఆర్టీసీ స్థలంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న డబ్బాలు

ఆక్రమించి చిరువ్యాపారులకు అద్దెకు

పలుమార్లు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించినా విఫలం

దుకాణ సముదాయం నిర్మిస్తే సంస్థకు ఆదాయం

నర్సాపూర్‌, మే 22: పట్టణంలోని బస్టాండు సమీపంలో ఆర్టీసీకి మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారికి ఆనుకుని కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో పెద్దలు పాగా వేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ స్థలంలో ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న డబ్బాలను చిరు వ్యాపారాలకు అద్దెకు ఇచ్చి కాసులు పోగేసుకుంటున్నారు. ఇక్కడ దుకాణ సముదాయాలు నిర్మించి అద్దెకు లేదా లీజుకు ఇస్తే ఆర్టీసీకి పెద్దమొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. వివిధ రకాల ఒత్తిళ్లతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. ఈ స్థలం ఆర్టీసీది అయితే అందులో షాపులు ఏర్పాటు చేసి అద్దెల రూపంలో డబ్బు పొందుతుంది మాత్రం స్థానికంగా పలుకుబడి ఉన్న పలువురు కావడం ఓ వింత. కనీసం చిరువ్యాపారులైన ఆస్థలంలో ఉండి ఉపాధి పొందుతున్నారంటే చూసిచూడనట్లు ఉండొచ్చు కాని వారు కూడా అద్దెలు చెల్లిస్తూ నష్టపోతుండడం విచారకరం. ఆర్టీసీ అధికారులు పలుమార్లు స్థలం స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చిరువ్యాపారం చేసుకునే వ్యాపారులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తమ ఉపాధి కోల్పోకుండా దుకాణ సముదాయాలు నిర్మిస్తే సహకరిస్తామన్నారు. అందులో తమకు దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తే స్వాధీనం చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కాని తమ పొట్ట కొట్టి స్థలం స్వాధీనం చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులో ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ పేర్కొనడంతో ఆర్టీసీ అధికారులు కూడా ఈ విషయంలో వివాదస్పదం ఎందుకనో వాటిజోలికి వెళ్లడం లేదు. ఆర్టీసీ ఆదాయం వచ్చే మార్గం ఆలోచించి ఈ స్థలంలో దుకాణ సముదాయాలు నిర్మించి ప్రస్తుతం ఉన్న చిరు వ్యాపారులకే కేటాయిస్తే అటువారికి న్యాయం జరుగుతుంది మరో వైపు ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-05-23T04:58:03+05:30 IST