ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి
ABN , First Publish Date - 2022-08-10T06:12:08+05:30 IST
గిరిజన సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి అన్నారు.
- గిరిజనాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- ఆదివాసీ దినోత్సవంలో అనకాపల్లి కలెక్టర్ రవి పట్టన్శెట్టి
అనకాపల్లిటౌన్, ఆగస్టు 9 : గిరిజన సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి అన్నారు. పట్టణంలోని రాజీవ్గాంధీ ఇండోర్స్టేడియంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గిరిజనుల హక్కుల సంపూర్ణ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వీరి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నాయని, ప్రకృతితో మమేకమైన వారి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు. తాను మొట్టమొదట సబ్ కలెక్టర్గా రంపచోడవరం, ఆ తరువాత పాడేరు ఐటీడీఏ పీవోగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయడం వల్ల గిరిజన సమాజం నుంచి తాను ప్రేరణ పొందానని వివరించారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మాట్లాడుతూ గిరిజన యువత తమ హక్కులను తెలుసుకోవాలన్నారు. ఆదివాసీలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారై ఉంటారని, ఒకరికి సహాయం చేయడం వారి నైజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకటరమణ, జడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి వరహా సత్యవతి, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి శిరీషా, కార్పొరేటర్ పీలా లక్ష్మీసౌజన్య, తుమ్మపాల సర్పంచ్ తట్టా పెంటయ్యనాయుడులతో పాటు పలు ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న థింసా నృత్యాలు
ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలు, వసతి గృహాల నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీడికాడ మండలం కోనాం, నాతవరం మండలం రామన్నపాలెం, నర్సయ్యపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలు చేసిన నృత్యాలు మంత్ర ముగ్ధులను చేశాయి. జి.మాడుగుల మండలం గిరిజన బాలికలు చేసిన థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు ఏకప్రాత్రాభినయం, ఆకట్టుకుంది.