అసైన్డ్ భూమి వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ విచారణ
ABN , First Publish Date - 2022-09-29T05:45:17+05:30 IST
మండలంలోని రామకృష్ణాకాలనీలో అసైన్డ్ భూమిలో ఒకే ఇంటి నంబరుతో పలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాలతో బుధవారం అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ విచారణ చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యలయంలో పలు రికార్డులను పరిశీలించారు.
తిమ్మాపూర్, సెప్టెంబరు 28: మండలంలోని రామకృష్ణాకాలనీలో అసైన్డ్ భూమిలో ఒకే ఇంటి నంబరుతో పలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాలతో బుధవారం అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ విచారణ చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి పద్మ, మాజీ పంచాయతీ కార్యదర్శి రాము, ఈ పంచాయతీ ఆపరేటర్ సంధ్య, కరోబార్ అనిల్ను విచారించి వారి వాంగ్ములం తీసుకున్నారు. రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకువెళ్ళారు. అనంతరం 629/13 సర్వే నంబరులో గల అసైన్డ్ భూమిని క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. సర్పంచ్ మీసాల అంజయ్యతోపాటు పంచాయతీ సిబ్బందిని ఇంటి నంబర్ 2/91/10 కేటాయించిన ఇల్లు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఇతర వివరాలు అడిగి తిమ్మాపూర్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ సబ్ రిజిస్టర్ మైసయ్యను ఒకే ఇంటిపై రిజిస్ట్రేషన్లు చేయడంపై ప్రశ్నించి, పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ఇంటి నంబరు 2/91/10పై 18 జీపీఏ రిజిస్ట్రేషన్లు, ఎనిమిది సేల్ డీడ్లు, ఒక పార్టిషన్ జరిగినట్లు గుర్తించామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దీని పై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. ఆయన వెంట డీపీవో వీర బుచ్చయ్య, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంపీవో కిరణ్కుమార్ ఉన్నారు.