తుఫాన్లో ప్రాణనష్టం లేకుండా చర్యలు
ABN , First Publish Date - 2021-12-03T06:20:53+05:30 IST
జిల్లాలో తుఫాన్ ప్రభావంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి జె.శ్యామలరావు ఆదేశించారు.
రిజర్వాయర్ల వద్ద అధికారుల పర్యవేక్షణ
ప్రత్యేకాధికారి శ్యామలరావు
విశాఖపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుఫాన్ ప్రభావంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి జె.శ్యామలరావు ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాతావరణశాఖ సమాచారం మేరకు విశాఖ జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట్ల ముందస్తు చర్యలన్నీ తప్పకుండా తీసుకోవాలన్నారు. తుఫాన్ షెల్టర్లు, తాగునీరు, ఆహార పదార్థాలు, విద్యుత్, కమ్యూనికేషన్స్ వ్యవస్థ సరిచూసుకోవాలన్నారు. రిజర్వాయర్ల వద్ద అఽధికారులతో పర్యవేక్షణకు బృందాలను నియమించాలని సూచించారు. తీవ్రమైన గాలులు, వరద ముంపు సంభవించే ప్రాంతాలను గుర్తించి అక్కడకు ఎన్డీఆర్ఎఫ్ దళాలను తరలించాలన్నారు. గాలుల తీవ్రతకు నేలకొరిగిన చెట్లు తొలగించడానికి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, పరిశీలన చేసిన స్థలాలు, అందుబాటులో ఉన్న వనరుల గురించి వివరించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.