ప్రజల జీవితాలతో చెలగాటమాడితే చర్యలు
ABN , First Publish Date - 2021-11-30T06:55:04+05:30 IST
అధిక లాభాపేక్షతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై ఆహార కల్తీ నిరోధక శాఖాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఆహార కల్తీ నిరోధక అధికారుల తనిఖీల్లో నకిలీ టీ పొడి పెద్దఎత్తున పట్టుబ
కిరాణ దుకాణాలపై కల్తీ నిరోధక శాఖాధికారుల తనిఖీలు
పలు దుకాణాల్లో కల్తీ టీ పొడి గుర్తింపు.. శాంపిళ్ల సేకరణ
నల్లగొండ టౌన్, నవంబరు 29 : అధిక లాభాపేక్షతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై ఆహార కల్తీ నిరోధక శాఖాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఆహార కల్తీ నిరోధక అధికారుల తనిఖీల్లో నకిలీ టీ పొడి పెద్దఎత్తున పట్టుబడడంతో ఆ శాఖ అధికారులు తాజాగా నల్లగొండ జిల్లాకేంద్రంలోని పాతబస్తీ ప్రాంతంలో గ ల కిరాణ వర్తక వ్యాపార సముదాయాలపై సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్మోతిర్మయి నేతృత్వంలో కమాన్ ప్రాం తంలోని చౌరస్తాలో పలు హోల్సేల్, రిటైల్ దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొన్ని దుకాణాల్లో లూజ్ టీ పొడి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. వీటికి ఎలాంటి లేబుల్స్, మ్యాన్ఫ్యాక్చరీ లేకపోవడంతో వాటన్నింటిని సీజ్ చేసి పరీక్షల నిమిత్తం నాచారం ల్యాబ్కు తరలించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ ఇటీవల సూర్యాపేటలో నిర్వహించిన తనిఖీల్లో కొందరు వ్యాపారులు నకిలీ టీ పొడి విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేయడమే కాకుండా వారి అనారోగ్యానికి కారణం అవుతున్నట్లుగా గుర్తించామని, వారందరిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉండటంతో ఆకస్మిక తనిఖీలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో పలువురు దుకాణదారులు ఈ విధంగా వినియోగదారులను మోసగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ల్యాబ్ రిపోర్టుల అనంతరం సదరు వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు ఇలాంటి మోసాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.