అభ్యర్థుల నేరచరిత్ర వెల్లడించని పార్టీలపై చర్యలు

ABN , First Publish Date - 2021-07-21T07:15:52+05:30 IST

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించని రాజకీయ పార్టీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది.

అభ్యర్థుల నేరచరిత్ర వెల్లడించని పార్టీలపై చర్యలు

  • గుర్తింపు రద్దు లేదా ఎన్నికల గుర్తు సస్పెన్షన్‌
  • తీర్పును రిజర్వులో ఉంచిన సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ, జూలై 20: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించని రాజకీయ పార్టీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ విషయంలో పార్టీలకు ఎలాంటి శిక్ష విధించాలన్న అంశంపై సీనియర్‌ న్యాయవాదులు కోర్టుకు సూచనలు చేశారు. పార్టీల గుర్తింపును రద్దుచేయడం లేదా ఎన్నికల గుర్తును కొంతకాలం నిషేధించడం వంటి శిక్షలను కోర్టు పరిశీలించే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్‌ రోహింటన్‌ నారీమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం తీర్పును వెలువరించాల్సి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు వెల్లడించాలి. 


అయితే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దీనిని విస్మరిస్తూ.. వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయంటూ ఓ న్యాయవాది దాఖలుచేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చట్టాలను అమలుచేయని పార్టీల గుర్తింపును సస్పెండ్‌ చేయడం లేదా రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుందని ఈసీ తరఫు న్యాయవాది వికాస్‌ సింగ్‌, మరో సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాధన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. సీపీఎం, ఎన్సీపీలు కోర్టుకు క్షమాపణలు తెలిపాయి. దీనిపై జస్టిస్‌ నారీమన్‌ స్పందిస్తూ.. మాకు క్షమాపణలు అవసరం లేదు, కోర్టు ఉత్తర్వులు పాటించాలన్నారు. పార్టీల వివరణపై సంతృప్తి చెందని బెంచ్‌ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు పేర్కొంది.

Updated Date - 2021-07-21T07:15:52+05:30 IST