రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-01-16T04:45:48+05:30 IST

మండలంలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శుక్రవారం ఇద్దరు గాయపడ్డారు.

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సొల్లేటి సందీప్‌

 మనుబోలు, జనవరి 15: మండలంలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శుక్రవారం ఇద్దరు గాయపడ్డారు. వెంకన్నపాళెంకు చెందిన సందీప్‌, ఆయన తండ్రి రమణయ్య గ్రామం నుంచి మోటార్‌సైకిల్‌పై మనుబోలుకు వస్తున్నారు. ఇంట్లో సిలిండర్‌ అయిపోవడంతో మోటార్‌సైకిల్‌ ముందు సిలిండర్‌ను పెట్టుకుని వస్తుండగా మనుబోలు పొలాల సమీపంలోని మలుపు వద్ద కోట మండలంకు చెందిన టాటా ఏసీ వ్యాన్‌ కూలీలను తీసుకెళ్లేందుకు నిలబడి ఉంది. సుమంత్‌ మోటార్‌సైకిల్‌ మలుపుతిప్పే క్రమంలో సిలిండర్‌ హ్యాండిల్‌కు ఇరుక్కుపోవడంతో వేగాన్ని అదుపు చేయలేక మోటార్‌సైకిల్‌ వ్యాన్‌ను ఢీకొంది.  ఈ ప్రమాదంలో సందీప్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో కాగితాలపూరు గ్రామానికి చెందిన ఎం. ముత్యాలయ్య అనే వృద్ధుడు మోటార్‌సైకిల్‌పై నారు కోసం సైదాపురంకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు మోటార్‌ సైకిల్‌ బోల్తా పడింది. దీంతో గాయాలైన ముత్యాలయ్యకు 108 సిబ్బంది సంతోష్‌, రాంబాబు ప్రథమ చికిత్స చేసి గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. 




Updated Date - 2021-01-16T04:45:48+05:30 IST