Arms Smuggling: ఢిల్లీలో తప్పిన పెను ముప్పు... భారీగా ఆయుధాల స్వాధీనం...
ABN , First Publish Date - 2022-08-12T18:06:04+05:30 IST
స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకునేందుకు యావత్తు దేశం
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకునేందుకు యావత్తు దేశం సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీలో పెను ముప్పు తప్పింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2,000 లైవ్ కార్ట్రిడ్జెస్, తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్లో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఐసిస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు మొహిసిన్ అహ్మద్ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అహ్మద్ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను ఆన్లైన్, ఆఫ్లైన్లలో చురుగ్గా నిర్వహిస్తున్నాడని అహ్మద్పై ఆరోపణలను నమోదు చేశారు.
ఇదిలావుండగా, భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.