ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆ హామీ నెరవేరేనా?
ABN , First Publish Date - 2020-07-13T14:18:31+05:30 IST
వృద్ధాప్య పింఛన్ వయసును 57ఏళ్లకు కుదిస్తామని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. వయసు కుదింపుతో ఆసరా వస్తుందని ఆశించిన వృద్ధులకు తీవ్ర నిరాశే మిగులుతోంది.
కొత్తవారికి.. ఆసరా ఏది?
అర్హత వయసు కుదించడంతో భారీగా దరఖాస్తులు
అధికారుల పరిశీలన.. అర్హులుగా 31,947 మంది గుర్తింపు
ఏడాదిన్నర అయినా మంజూరు కాని పింఛన్లు
వృద్ధులు, దివ్యాంగులకు తప్పని ఎదురుచూపులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరేనా?
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : వృద్ధాప్య పింఛన్ వయసును 57ఏళ్లకు కుదిస్తామని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. వయసు కుదింపుతో ఆసరా వస్తుందని ఆశించిన వృద్ధులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. పింఛన్ల రెట్టింపుతోపాటు వయస్సు 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కేవలం పింఛను డబ్బు రెట్టింపు చేసి చేతులు దులుపుకుంది. దీంతో జిల్లాలో 31,947 వేల మంది వృద్ధులు ఆసరా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం 65ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఆసరా పింఛన్ వస్తుంది. ఇదివరకు దివ్యాంగులకు పింఛన్ రూ.1,500 ఉండగా వా టిని రూ.3,016కు.. ఇతరులకు రూ.1,000 ఉన్నది రూ. 2,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. 2019 జూన్ నుంచి వర్తిం పజేసి పంపిణీ చేసింది. అయితే వృద్ధాప్య పింఛన్ వయసు తగ్గించక పోవడంతో వేలాది మంది నిరాశకు గురవుతు న్నారు. ఓటరు జాబితాను ప్రామా ణికంగా తీసుకుని 57ఏళ్ల వయసు ఉన్నవారిని 31,947 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గ దర్శ కాలు రాకపోవ డంతో గ్రామీణా భివృద్ధి శాఖ అధికారులు ఆ జాబితా, ప్రయత్నాలను పక్కన పెట్టారు.
పెండింగ్లో మరిన్ని..
జిల్లాలో 5,712 పెన్షన్లు పెండిం గ్లో ఉన్నాయి. ఎంపీడీవోలు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించారు. డీఆర్డీవో అధికారులు ఆన్ లైన్లో ఓకే చేశారు. కానీ.. రాష్ట్రస్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. లబ్ధిదారులు ఆసరా కోసం దరఖాస్తులు చేసుకుని ఏడాదిన్నర కావస్తుంది. పెన్షన్ ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు.
ఆసరా పింఛనుదారుల వివరాలు
పింఛను రకాలు లబ్ధిదారులు
వృద్ధాప్య 57,687
వితంతు 78,193
వికలాంగులు 27,292
కల్లుగీత 2,082
చేనేత 774
బీడీ కార్మికులు 16
ఒంటరి మహిళ 6001
మొత్తం 1,72,045