Amnesty International India: మనీలాండరింగ్ కేసులో ఆకార్ పటేల్కు సమన్లు
ABN , First Publish Date - 2022-06-12T16:16:20+05:30 IST
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్-సీఈఓ
బెంగళూరు : అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్-సీఈఓ ఆకార్ పటేల్, మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఫిర్యాదు మేరకు నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది. జూన్ 27న హాజరుకావాలని వీరిని ఆదేశించింది.
ఇండియన్స్ ఫర్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్, ఏఐఐపీఎల్ మాజీ సీఈఓ జీ అనంత పద్మనాభన్, ఆకార్ పటేల్లకు ఈ కేసులో స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఫిర్యాదును స్పెషల్ కేసుగా నమోదు చేయాలని ఆదేశించింది. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జి సంతోష్ గజానన్ భట్ ఈ చర్యలు తీసుకున్నారు.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (FCRA)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందకుండా బ్రిటన్లోని సంస్థల నుంచి రూ.36 కోట్లు స్వీకరించిందని ఈడీ ఆరోపించింది. ఈ సంస్థ వ్యాపార పద్ధతులను ఉపయోగించి ఈ నిధిని సేకరించిందని పేర్కొంది.