బీడీ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేయాలి
ABN , First Publish Date - 2021-04-13T06:11:41+05:30 IST
బిల్డింగ్ వర్కర్స్, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేసి కార్మికులను ఆదుకోవాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు అన్నారు.
పెద్ద బజార్, ఏప్రిల్ 12: బిల్డింగ్ వర్కర్స్, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేసి కార్మికులను ఆదుకోవాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నిర్వహించిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, ప్యాకర్లు, బట్టి చటాన్, టేకేదార్లు సుమారు 8 లక్షల మంది జీవిస్తున్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు టీబీ, షుగర్, క్యాన్సర్, గుండెపోటు వంటి జబ్బులతో మరణిస్తున్నారన్నారు. సహజంగా మరణించినవారికి రూ.5లక్షలు, ప్రమాదంలో, అనారోగ్యంతో మరణిస్తే రూ. 10 లక్షలు, డెలివరీ అయినవారికి రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రసూతి సెలవులతోపాటు వారి పిల్లలకు పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం నేతలు నర్సింలు, రాజేందర్ తదిరులు పాల్గొన్నారు.