రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2022-08-17T05:58:31+05:30 IST
ఆటోను కారు ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన రేసపువానిపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్ద బీఆర్టీఎస్ రోడ్డులో జరిగింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాజమండ్రికి చెందిన ముప్పిడి ప్రవీణ్కుమార్ (33) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు.
మద్దిలపాలెం, ఆగస్టు 16: ఆటోను కారు ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన రేసపువానిపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్ద బీఆర్టీఎస్ రోడ్డులో జరిగింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాజమండ్రికి చెందిన ముప్పిడి ప్రవీణ్కుమార్ (33) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. నాలుగు నెలలుగా మధురవాడలోని సోదరి వద్ద ఉంటూ వర్క్ఫ్రంహోమ్ చేస్తున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా ఈనెల 11న విజయవాడలోని మరో సోదరితో రాఖీ కట్టించుకునేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి 15న బస్సులో బయలుదేరి, మంగళవారం ఉదయం ద్వారకా కాంప్లెక్స్కు చేరుకున్నాడు. మధురవాడ వెళ్లేందుకు షేర్ ఆటోలో బయలుదేరాడు, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్దకు ఆటో రాగానే, వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఆటోను బలంగా ఢీకొట్టడంతో పల్టీకొట్టి, తిరగబడింది. అందులో ఉన్న ప్రవీణ్కుమార్ రోడ్డుపై తుళ్లిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మువ్వల సంతోష్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.