ఆస్పత్రిలో మహిళ మృతదేహాన్ని వదలివెళ్లిన భర్త
ABN , First Publish Date - 2021-04-21T06:12:27+05:30 IST
భార్య మృతదేహాన్ని తీసుకెళ్లే క్రమంలో నగదు తెస్తానని వెళ్లి తిరుపతికి చెందిన నగేష్ అదృశ్యమైన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.
శ్రీకాళహస్తి అర్బన్, ఏప్రిల్ 20: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నగదు తెస్తానని వెళ్లిన భర్త అదృశ్యమైన సంఘటన మంగళవారం శ్రీకాళహస్తిలో జరిగింది. వివరాలివీ.. తిరుపతి నగరం జీవకోనకు చెందని నగేష్, మనీషా(30) దంపతులు తిరుమలలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల మనీషాకు పచ్చకామెర్లు సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు నాటు మందు తినిపించాలని మంగళవారం నగేష్ భార్యతో కలసి శ్రీకాళహస్తి వచ్చారు. ఈ నేపథ్యంలో మందు తీసుకోక మునుపే మనీషా అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లగా, అత్యవసర విభాగ వైద్యులు ఆమెను పరీక్షించి మృతిచెందినట్లు పేర్కొన్నారు. దీంతో భార్య మృతదేహాన్ని తిరుపతికి తీసుకెళ్లేందుకు ఏటీఎంలో నగదు డ్రా చేసుకుని వస్తానని చెప్పిన నగేష్ మాయమయ్యాడు. అయితే ఆయన ఎంతసేపటికీ రాకపోవడంతో వైద్య సిబ్బంది మనీషా మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం ఆస్పత్రి అధికారులు ఈ సమాచారం శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులకు అందజేశారు.