ఉక్రెయిన్ నుంచి తప్పించుకునే యత్నం.. పోలండ్ సరిహద్దు వైపుగా భారతీయ విద్యార్థుల నడక
ABN , First Publish Date - 2022-02-26T00:09:35+05:30 IST
రష్యా దళాలు కీవ్ను సమీపిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి రష్యా సైన్యం చొచ్చుకొస్తూ కీవ్ను చుట్టుముడుతున్నాయి
కీవ్: రష్యా దళాలు కీవ్ను సమీపిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి రష్యా సైన్యం చొచ్చుకొస్తూ కీవ్ను చుట్టుముడుతోంది. మరికొన్ని గంటల్లో ఉక్రెయిన్పై జెండా పాతేందుకు రష్యా సిద్దమైంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే భీకర యుద్ధం జరుగుతున్న వేళ అక్కడ చిక్కుకున్న భారతీయుల క్షేమంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశం నలుమూలల నుంచి ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు.
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ విరుచుకుపడుతున్న వేళ అక్కడ చిక్కుకుపోయిన భాతీయులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, అప్పటి వరకు ఏం జరుగుతుందో, ఎక్కడ తలదాచుకోవాలో పాలుపోని భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటేందుకు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఉక్రెయిన్-పోలండ్ సరిహద్దుకు పయనమవుతున్నారు.
ఉక్రెయిన్లోని పశ్చిమ నగరమైన ఎల్వివ్లోని డేన్లో హలిస్కీ మెడికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 40 మంది భారతీయ విద్యార్థులు నడుచుకుంటూ సమీపంలోని పోలండ్ సరిహద్దుకు బయలుదేరారు. అంతకుముందు వారిని కళాశాల బస్సు ద్వారా సరిహద్దు పాయింట్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టారు.