సర్జికల్ స్ట్రైక్స్ నిజమే, 300 మంది ఉగ్రవాదులు హతం : పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

ABN , First Publish Date - 2021-01-10T00:44:44+05:30 IST

పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలలీ నిప్పులాంటి నిజాలను లక్షలాది మంది

సర్జికల్ స్ట్రైక్స్ నిజమే, 300 మంది ఉగ్రవాదులు హతం : పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలలీ నిప్పులాంటి నిజాలను లక్షలాది మంది సాక్షిగా బయటపెట్టారు. 2019 ఫిబ్రవరి 26న భారత వాయు సేన నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఓ టెలివిజన్ డిబేట్‌లో చెప్పారు. దీంతో అనేక మంది విమర్శకుల నోటికి తాళం పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని చెప్పిన పాకిస్థాన్‌కు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారవచ్చు. 


2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్థాన్‌ నుంచి పని చేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దారుణాన్ని అంతర్జాతీయంగా అనేక మంది ఖండించారు. అనంతరం భారత వాయు సేన బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేసింది. అప్పట్లో దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ, తమవైపువారు ఎవరూ మరణించలేదని ప్రకటించింది. 


అఘా హిలలీ తరచూ టెలివిజన్ డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు. ఆయన పాకిస్థాన్ ఆర్మీకి వంతపాడుతూ ఉంటారు. తాజాగా ఆయన పాకిస్థానీ ఉర్దూ ఛానల్ డిబేట్‌లో మాట్లాడుతూ, భారత దేశం అంతర్జాతీయ సరిహద్దులను దాటుకుని వచ్చిందని, యుద్ధ చర్యకు పాల్పడిందని చెప్పారు. ఈ చర్యలో కనీసం 300 మంది మరణించినట్లు తెలిసిందని తెలిపారు. ‘‘మా లక్ష్యం వారి లక్ష్యానికి భిన్నమైనది. మేం వారి హై కమాండ్‌ని టార్గెట్ చేశాం. అది మా న్యాయమైన టార్గెట్, ఎందుకంటే వారు సైనికులు. సర్జికల్ స్ట్రైక్స్‌లో ఎవరూ మరణించలేదని అంతర్లీనంగా చెప్పాం. ఇప్పుడు అంతర్లీనంగా వాళ్లకి ఏం చెప్తున్నామంటే, వాళ్లు ఏం చేసినా, వాళ్ళు ఎంత చేస్తే, మేం కూడా అంతే చేస్తామని, అంతకన్నా ఉద్ధృతం చేయబోమని చెప్తున్నాం ’’ అని పేర్కొన్నారు. 


2019 ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న యుద్ధ విమానం పాకిస్థానీ విమానంతో పోరాడుతూ, పాక్ భూభాగంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను 2019 మార్చి 1న పాకిస్థాన్ విడుదల చేసింది. ఆయన అట్టారీ-వాఘా సరిహద్దు గుండా భారత దేశానికి తిరిగి వచ్చారు. 


పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ నేత అయాజ్ సాదిక్ 2020 అక్టోబరులో ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, అభినందన్‌ విడుదల గురించి మాట్లాడారు.  ఓ ముఖ్యమైన సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ఆ రోజు అభినందన్‌ను విడుదల చేసి ఉండకపోతే, అదే రోజు రాత్రి 9 గంటల కల్లా భారత దేశం పాకిస్థాన్‌పై దాడి చేసి ఉండేదని ఖురేషీ అన్నారని చెప్పారు. భారత దేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని ఖురేషీ చెప్పేసరికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా కాళ్లు వణికాయని తెలిపారు. అందుకే అభినందన్‌ను విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 


Updated Date - 2021-01-10T00:44:44+05:30 IST