Kim Jong Unపై జపాన్ కోర్టులో కేసు
ABN , First Publish Date - 2021-10-14T19:26:40+05:30 IST
ఉత్తర కొరియాను వదిలి వెళ్ళిపోయినవారు గురువారం
టోక్యో : ఉత్తర కొరియాను వదిలి వెళ్ళిపోయినవారు గురువారం ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్పై టోక్యో కోర్టులో కేసు పెట్టారు. స్వదేశానికి తిరిగి వెళ్ళే రిపాట్రియేషన్ పథకంపై ఈ కేసు దాఖలు చేశారు. ప్రభుత్వ అపహరణల పథకం అని వీరు పేర్కొంటున్న ఈ పథకంలో భాగంగా 1959-1984 మధ్య కాలంలో జపాన్ నుంచి ఉత్తర కొరియాకు దాదాపు 90,000 మంది వెళ్ళారు. ఈ పథకానికి ఉత్తర కొరియాను బాధ్యురాలిని చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ అసాధారణ కేసు దాఖలైంది.
కొరియా మూలాలుగలవారిని మాత్రమే కాకుండా, వారి జపనీస్ భార్యను లేదా భర్తను కూడా ఈ పథకం క్రింద టార్గెట్ చేశారు. భూమిపై స్వర్గం అంటూ అద్భుతమైన ప్రచారం చేసి వీరిని ఆకర్షించారు. ఈ రిపాట్రియేషన్ స్కీమ్లో పాలుపంచుకున్న ఐదుగురు ఆ తర్వాత ఉత్తర కొరియా నుంచి వెళ్ళిపోయారు. ఈ ఐదుగురు టోక్యో జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. తమకు నష్ట పరిహారంగా ఒక్కొక్కరికి 8,80,000 డాలర్ల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తర కొరియాలో మానవ హక్కులను అనుభవించడం సాధారణంగా అసాధ్యమని వీరు ఆరోపించారు. తప్పుడు ప్రకటనలతో తమను ఉత్తర కొరియా మోసం చేసిందని ఆరోపించారు.
జపాన్, ఉత్తర కొరియా మధ్య దౌత్య సంబంధాలు లేనందువల్ల టోక్యో కోర్టు కిమ్ జోంగ్ ఉన్ను ఉత్తర కొరియా ప్రభుత్వాధినేతగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది గత నెలలో మాట్లాడుతూ, టోక్యో కోర్టు ఆదేశాలను, తీర్పును ఉత్తర కొరియా అంగీకరిస్తుందని తాము ఆశించడం లేదన్నారు. అయితే ఉత్తర కొరియాతో జపాన్ చర్చలు జరుపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
జపాన్, ఉత్తర కొరియాలలోని రెడ్ క్రాస్ సొసైటీలు ఈ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించాయి. దీని కోసం అయ్యే ఖర్చులను ఉత్తర కొరియా భరించింది. ఈ పథకంలో 93,340 మంది పాలుపంచుకున్నారు. కొరియన్ల కోసం అమలు చేస్తున్న మానవతావాద కార్యక్రమంగా ఈ పథకాన్ని మీడియా ప్రచారం చేయడంతో జపాన్ కూడా మద్దతిచ్చింది.