ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-05-23T05:58:13+05:30 IST

మండల పరిధిలోని కరమలవారిపల్లి గ్రామ సమీపంలో జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలో శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ముగ్గురు మృతి
సంఘటనా స్థలంలో నుజ్జు నుజ్జు అయిన కారు

ఇరువురికి తీవ్ర గాయాలు


మైలవరం, మే 22 : మండల పరిధిలోని కరమలవారిపల్లి గ్రామ సమీపంలో జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలో శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన దండె వెంకట సుబ్బయ్య (43), అదే గ్రామానికి చెందిన కుండా వెంకట సుబ్బమ్మ (73), మోరగుడికి చెందిన చౌడం లక్ష్మీ మునెమ్మ (52) తల్లీ కూతుళ్లు మృతి చెందగా, కారు డ్రైవర్‌ కుమార్‌, చిన్నారి గీతాంజలి గాయపడ్డారని మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మోరగుడి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చౌడం తిరుమల కొండయ్య, చౌడం లక్ష్మీ మునెమ్మల కుమార్తెకు పది రోజుల క్రితం నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం ఉదయం మోరగుడి నుంచి రెండు వాహనాల్లో కూతురికి చీరె సారె తీసుకుని సంగపట్నం బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం పూర్తి కాగానే రాత్రి సంగపట్నం నుంచి మోరగుడికి తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో ఐదు నిమిషాల్లో మోరగుడిలోని తమ ఇంటికి చేరుకునేలోపు కరమలవారిపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో చిన్నకొమెర్ల వైపు నుంచి జమ్మలమడుగు వెళ్తున్న లారీ రిపేరు రావడంతో రోడ్డు పక్కన ఆపివేశారు. లారీకి ఎలాంటి సిగ్నల్‌ వెనుక వైపున లేకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనం వెలుతురుకు పక్కనున్న లారీ కనబడకపోవడంతో కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న తల్లీ కూతురు కుండా వెంకటసుబ్బమ్మ, చౌడం లక్ష్మీ మునెమ్మ, పెళ్లి పెద్ద అయిన దండె వెంకటసుబ్బయ్యల తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ కుమార్‌, మరో చిన్నారి గీతాంజలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వెనుక వైపున మరో వాహనంలో వస్తున్న వారు మైలవరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జమ్మలమడుగు రూరల్‌ సీఐ కొండారెడ్డి, మైలవరం ఎస్‌ఐ, సిబ్బంది కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రధాన రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును ఎక్స్‌కవేటర్‌ సాయంతో పక్కకు తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.


 

Updated Date - 2022-05-23T05:58:13+05:30 IST