కశ్మీర్ ట్రెక్కర్స్కి సరికొత్త సవాల్ విసిరిన బెంగళూరు ‘అల్పైన్ గర్ల్’
ABN , First Publish Date - 2021-11-16T18:42:19+05:30 IST
బెంగళూరువాసి నమ్రత నందిష్ అత్యంత ఎత్తులో ఉన్న
శ్రీనగర్ : బెంగళూరువాసి నమ్రత నందిష్ అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులకు సాహస యాత్ర చేసి, ట్రెక్కింగ్ కమ్యూనిటీని ఆశ్చర్యపరిచారు. కశ్మీరులో అత్యంత ఎత్తులో ఉన్న 50 సరస్సులను కేవలం నాలుగు నెలల్లోనే చేరుకుని ట్రెక్కర్లకు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సులను అల్పైన్ సరస్సులు అంటారు. నమ్రత ఈ సరస్సులకు విజయవంతంగా సాహస యాత్ర చేయడంతో ఆమెను ‘అల్పైన్ గర్ల్’ అని పిలుస్తున్నారు.
నమ్రత బెల్లందూర్ ఏరియాలో ఉంటున్నారు. ఆమె హెచ్ఆర్ మేనేజర్గా పని చేస్తున్నారు. దక్షిణ కశ్మీరులోని పహల్గావ్ ఏరియాలో పీర్ పంజల్-జంస్కర్ మౌంటెయిన్ రేంజెస్ మధ్య ఉన్న టులియన్ లేక్ నుంచి ఆమె తన సాహస యాత్రను ప్రారంభించారు. అనంత్నాగ్-కీస్త్వర్ ఏరియాలోని షిల్సర్ సరస్సుతో ఆమె ట్రెక్కింగ్ ముగిసింది.
నమ్రత (33) మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 26న తాను తన భర్త అభిషేక్తో కలిసి శ్రీనగర్లోని ఓ హోటల్లో దిగామని చెప్పారు. తనకు తాను పుట్టిన రోజు బహుమతి ఇచ్చుకోవాలని నిర్ణయించుకున్నానని, మొదట్లో 33 సరస్సులకు ట్రెక్ చేయాలని ప్రణాళిక రచించుకున్నామని చెప్పారు. ఆ తర్వాత మొత్తం మీద 50 సరస్సులకు ట్రెక్ చేసినట్లు తెలిపారు.
నమ్రతకు గైడ్గా వ్యవహరించిన సయ్యద్ తాహిర్ మాట్లాడుతూ, యాత్రికులు మూడు, నాలుగు రోజులపాటు లాంగ్ ట్రక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడికి వస్తూ ఉంటారన్నారు. కానీ ఓ మహిళ సీజన్ ప్రారంభమవడానికి ముందే తనకు తాను ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చారని, ఇది విశేషమని అన్నారు.