8 పంటలు-17 రకాల కొత్త వంగడాలు
ABN , First Publish Date - 2020-10-17T07:28:11+05:30 IST
గడచిన ఏడెనిమిది నెలలుగా దేశంలోని 80 కోట్లమంది పేద ప్రజానీకానికి ఉచితంగా రేషన్ను, ఆహార
జాతికి అంకితం చేసిన ప్రధాని
న్యూఢిల్లీ, అక్టోబరు 16: గడచిన ఏడెనిమిది నెలలుగా దేశంలోని 80 కోట్లమంది పేద ప్రజానీకానికి ఉచితంగా రేషన్ను, ఆహార దినుసులను అందజేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ’కొవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపం గురించి రకరకాలుగా చర్చ జరిగింది. కానీ మనం ఉచితంగా కోట్లాదిమందికి రేషనిచ్చాం. దాదాపు లక్షా 15వేల కోట్ల విలువైన ఆహారదినుసులను పంపిణీ చేశాం.
ఇలాంటిదెక్కడా జరగలేదు..అదే విధంగా పోషకాహార లోప సమస్యనూ అధిగమించే కృషి సాగుతోంది. ఇపుడు ఎక్కువ మాంసకృత్తులుండే ఆహారదినుసులుండేవే పండించేట్లు ప్రోత్సహిస్తున్నాం. ప్రొటీన్, ఐరన్, జింక్ పరిమాణాలు ఎక్కువ ఉండే పంటలకు ప్రాధాన్యమిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ఏర్పడి 75 ఏళ్లయిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఎనిమిది రకాల పంటలకు సంబంధించిన 17 బయోఫోర్టిఫైడ్ (జన్యుపరంగా అభివృద్ధి చేసిన) వంగడాలను జాతికి అంకితం చేశారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయమంత్రి నరేంద్ర తోమర్ కూడా ట్వీట్ చేశారు. ఈ కొత్త వంగడాల్లో మూడు రెట్లు ఎక్కువ పోషకవిలువలున్నాయని పేర్కొన్నారు. కాగా- ఎఫ్ఏవోకు నోబె ల్ శాంతి బహుమతి రావడంపై ప్రధాని మోదీ హర్షం ప్రకటించారు. ఎఫ్ఏవో స్మారకంగా 75 రూపాయల విలువైన ఓ నాణేన్ని ఆయన విడుదల చేశారు.