వెలుగుల వజ్రోత్సవం
ABN , First Publish Date - 2022-08-15T06:14:31+05:30 IST
వెలుగుల వజ్రోత్సవం
స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు జిల్లాలు ముస్తాబు
బెజవాడ అంతా మువ్వన్నెలమయం
విద్యుత్ వెలుగులతో త్రివర్ణశోభితం
ముస్తాబైన ఇందిరాగాంధీ స్టేడియం
బందరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు
ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా రాక
రేపు పెదకళ్లేపల్లిలో పింగళి విగ్రహావిష్కరణ
విజయవాడ, ఆంధ్రజ్యోతి : బ్రిటీష్ పాలకుల నిరంకుశ శృంఖలాలను తెంచి, దాస్య చెర నుంచి భరతమాతకు విముక్తి కల్పించిన శుభదినమిది.. ఆసేతు హిమాచలాన స్వేచ్ఛా కుసుమాలు పూయించిన ప్రత్యేక పర్వదినమిది.. స్వతంత్ర సిద్ధి కోసం వీరమరణం పొందిన ఎందరో మహనీయుల త్యాగాల ఫలమిది. సామ్రాజ్యవాద దురహంకారాన్ని మొక్కవోని ధైర్యంతో ఎదిరించి.. స్వరాజ్య స్థాపన చేసిన పంద్రాగస్టు రోజు ఇది. 75 వసంతాల మన స్వాతంత్య్ర దినోత్సవమిది. త్రివర్ణ శోభితమై మన ముందుకొచ్చి నిలబడిన పండుగ ఇది. ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తి సెల్యూట్ చేసేలా వజ్రోత్సవాలకు జిల్లా సిద్ధమైంది. మూడు రంగులు మమేకమై జాతినంతటినీ ఒక్కటి చేయగా, వీనులవిందైన వందేమాతర నినాదాలు అన్నిచోట్లా మార్మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ముస్తాబు కాగా, మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు. పది రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఆదివారం కూడా అంబరాన్ని తాకగా, భారీ జాతీయ పతాకాలతో వేడుకలు పతాక స్థాయికి చేరాయి.