60.28 శాతం పోలింగ్: కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-09T06:23:13+05:30 IST
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 60.28 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.
కర్నూలు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 60.28 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. కలెక్టరేట్లో ఎస్పీతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాయని, మొత్తం 15,56,617 మంది ఓటర్లకు గాను 9,38,379 మంది ఓటు వేశారని తెలిపారు. అత్యధికంగా ఆళ్ళగడ్డ మండలంలో 74.42 శాతం, అత్యల్పంగా వెలుగోడు మండలంలో 40.94 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల వచ్చిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని, అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములో భద్రపరుస్తామని తెలిపారు. స్ట్రాంగ్ రూము వద్ద కాపలా ఉంటామని అభ్యర్థులు ముందుకు వస్తే వారికి అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. చెదురుమదురు ఘటనలు తప్ప పరిషత్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి రామ్ శంకర్ నాయక్, జడ్పీటీసీ సీఈవో వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.