లష్కరే పునర్జీవానికి కుట్ర.. ఆరుగురు అరెస్ట్..

ABN , First Publish Date - 2020-08-09T04:35:10+05:30 IST

లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రసంస్థకు నిధులు చేరవేస్తున్న ఓ ముఠాను భద్రతా బలగాలు ఇవాళ అదుపులోకి తీసుకున్నాయి...

లష్కరే పునర్జీవానికి కుట్ర.. ఆరుగురు అరెస్ట్..

జమ్మూ: లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రసంస్థకు నిధులు చేరవేస్తున్న ఓ ముఠాను భద్రతా బలగాలు ఇవాళ అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ ప్రాంతంలో లష్కరే సంస్థకు మళ్లీ జీవం పోసేందుకు నిందితులు కుట్ర పన్నినట్టు అధికారులు వెల్లడించారు. ఆర్మీ ఇచ్చిన సమాచారంతో ఈ కుట్రను ఛేదించామనీ.. జమ్మూ నగరంలో సదరు ఉగ్ర సంస్థను బతికించుకునేందుకే నిధులు తరలిస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ముఠా కదలికలపై సమాచారం రాగానే భద్రతా బలగాలు ముద్దాసిర్ ఫరూక్ భట్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. అతడి వద్ద నుంచి ఓ బాక్సులో ఉంచిన రూ. 1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామనీ.. వాటిని లష్కరే కేడర్‌కి ఇచ్చేందుకే తీసుకెళ్తున్నారని సదరు అధికారి వెల్లడించారు. విచారణ సందర్భంగా తనకు లష్కరేతో సంబంధాలున్నాయని భట్ అంగీకరించాడు. అతడి నుంచి మరికొందరు ముఠా సభ్యుల సమాచారాన్ని రాబట్టిన పోలీసులు.. మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన మిగతా ఐదుగురు లష్కరే సానుభూతిపరుల్లో మౌల్వి తౌకీర్ అహ్మద్ భట్, ఎస్పీవో ముసుగులో ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న అసిఫ్ భట్, కాంట్రాక్టర్ ఖలీద్ లతీఫ్ భట్, జమ్మూలోని కటికా తలాబ్‌కి చెందిన గాజి ఇక్బాల్, తారిక్ హుస్సేన్ మిర్ తదితరులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2020-08-09T04:35:10+05:30 IST