ఉమ్మడి జిల్లాలో 409 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-17T05:46:21+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం 409 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని ఆయా ఆస్పత్రుల పరిధిలో 234 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
సిద్దిపేట, సంగారెడ్డిఅర్బన్, మెదక్అర్బన్, మే 16: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం 409 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని ఆయా ఆస్పత్రుల పరిధిలో 234 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఎన్ని పరీక్షలు నిర్వహించారు, ఎంతమందికి కరోనా సోకింది, మృతుల వివరాలు తదితర కొవిడ్ సంబంధిత సమాచారాన్ని వైద్యశాఖ వర్గాలు అధికారికంగా వెల్లడించడం లేదు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 106 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జోగిపేటలో 25, సంగారెడ్డిలో 20, పటాన్చెరులో 20 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,673 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి నుంచి 123, పటాన్చెరు ఆస్పత్రి నుంచి 110 శాంపిళ్లు గాంధీ ఆస్పత్రికి పంపినట్టు వైధ్యాధికారులు తెలిపారు. అలాగే, మెదక్ జిల్లాలో ఆదివారం 443 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 69 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో పాజిటివ్ కేసుల రేటు 15.6 శాతంగా నమోదైంది. అత్యధికంగా మెదక్లో 12 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 13,220కి చేరింది.
రెండు జిల్లాలో 10 మంది మృతి
సిద్దిపేట, మెదక్ అర్బన్, తూప్రాన్, మే 16: సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఎనిమిది మంది మృతిచెందారు. సిద్దిపేటలోని జీజీహెచ్ ఆస్పత్రిలో ఐదుగురు, పారుపల్లి వీధిలో ఒకరు, పటేల్పురలో ఒకరు, భారత్నగర్లో ఒకరు, హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో ఒకరు కరోనాతో మృతిచెందినట్టు సమాచారం. అలాగే, మెదక్ జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన వ్యక్తి (55) సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తూప్రాన్ పట్గణానికి చెందిన మహిళ (50) గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.