ఎండిపోయిన రిజర్వాయర్.. బయటపడిన 3400 ఏళ్లనాటి పురాతన నగరం!

ABN , First Publish Date - 2022-06-09T22:51:13+05:30 IST

ఇరాక్‌లో 3,400 ఏళ్లనాటి పురాతన నగరం ఒకటి బయటపడింది. కొన్ని నెలలపాటు తీవ్రమైన కరువు కారణంగా

ఎండిపోయిన రిజర్వాయర్.. బయటపడిన 3400 ఏళ్లనాటి పురాతన నగరం!

బాగ్దాద్: ఇరాక్‌లో 3,400 ఏళ్లనాటి పురాతన నగరం ఒకటి బయటపడింది. కొన్ని నెలలపాటు తీవ్రమైన కరువు కారణంగా ఓ రిజర్వాయర్ ఎండిపోగా అందులోంచి ఈ ఏడాది మొదట్లో ఈ నగరం బయటపడింది. రిజర్వాయర్‌లోని నీళ్లు పూర్తిగా అడుగంటిపోవడంతో మిట్టాని సామ్రాజ్యానికి చెందిన పురాతన నగరాన్ని జర్మన్, కుర్దిష్ పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నగరం ఒకప్పుడు టైగ్రిస్ నది ఒడ్డున ఉండేది. 1550-1350 మధ్య కాలం నాటి మిట్టాని సామ్రాజ్యానికి ముఖ్య కేంద్రమైన జఖికు నగరంగా దీనిని భావిస్తున్నారు. 

 

ఎండలో ఎండబెట్టిన మట్టి ఇటుకలతో కట్టిన గోడలను చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. మోసుల్ డ్యామ్ నిర్మించి రిజర్వాయర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఇది నీటి అడుగునే ఉంది. 1350లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇళ్ల పైభాగాలు కూలి ధ్వంసమై ఉంటాయని, ఆ తర్వాత భవనాలు పూర్తిగా కప్పబడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. 


వాతావరణ మార్పులు ఇరాక్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గత శతాబ్ద కాలంలో సగటు ఉష్ణోగ్రతలు దాదాపు ఒక సెంటీగ్రేడ్ పెరిగాయి. ముఖ్యంగా ఇరాక్ దక్షిణ భాగంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. వర్షాలు పడకపోవడం, వనరుల నిర్వహణ అధ్వానంగా ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. 


కుర్దిస్థాన్ ప్రాంతంలోని మోసుల్ డ్యాం రిజర్వాయర్ దేశానికి అతి ముఖ్యమైన నీటి నిల్వ ప్రాంతం. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు అధికారులు రిజర్వాయర్‌లోని నీటిని విడుదల చేయడంతో నీటి నిల్వలు క్రమంగా పడిపోయాయి. దీంతో కాంస్య యుగం నాటి నగర ఉపరితలం బయటపడింది.


రంగంలోకి దిగిన జర్మనీలోని ఫ్రీబర్గ్, టుబింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, కుర్దిస్థాన్ ఆర్కియాలజీ ఆర్గనైజేషన్ అధికారులు పారిశ్రామిక సముదాయం, గోడలు, టవర్లతో కూడిన కోటలు, పెద్ద నిల్వ భవనంతో సహా నగరంలోని చాలా భాగాన్ని విజయవంతంగా మ్యాపింగ్ చేశారు. ఆ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన వస్తువులను ఆ భవనంలో నిల్వ చేసి ఉండొచ్చని ఫ్రీబర్గ్ యూనివర్సిటీకి చెందిన ఇవానా పుల్జిజ్ తెలిపారు. బయటపడిన నగరం మిట్టాని సామ్రాజ్య ముఖ్య కేంద్రమై ఉంటుందని కుర్దిస్థాన్ ఆర్కియాలజీ ఆర్గనైజేషన్ చైర్మన్ హసన్ ఖాసిమ్ తెలిపారు.


టైగ్రిస్ నది ఒడ్డున ఒకప్పుడు జీవితం ఎలా ఉండేదో తెలిపేలా చిత్రించిన కళాఖండాలను కూడా బృందం వెలికితీసింది. అలాగే, ఐదు సిరామిక్ పాత్రల్లో చిత్రలిపితో ఉన్న 100 పలకలను కూడా వారు గుర్తించారు. దశాబ్దాల పాటు నీటిలో మునిగి ఉన్నా ఆ మట్టిపలకలపై ఉన్న మట్టి అలాగే ఉండడం పురాతత్వ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. 

Updated Date - 2022-06-09T22:51:13+05:30 IST