31న Petrol బంక్‌ల బంద్‌

ABN , First Publish Date - 2022-05-27T16:30:12+05:30 IST

అఖిల కర్ణాటక పెట్రోలియం ఉత్పత్తుల విక్రేతల సమాఖ్య తమ డిమాండ్ల సాధనకోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31న బంద్‌ పాటిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌

31న Petrol బంక్‌ల బంద్‌

బెంగళూరు: అఖిల కర్ణాటక పెట్రోలియం ఉత్పత్తుల విక్రేతల సమాఖ్య తమ డిమాండ్ల సాధనకోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31న బంద్‌ పాటిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై 1 శాతం కమీషన్‌ ఇవ్వాలని బంక్‌ల నిర్వహకులు 2017 నుంచి డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 31 తర్వాత డిపోల నుండి పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్ళను పూర్తిగా నిలిపేయాలని తీర్మానించినట్లు సమాఖ్య నగరంలో గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పలు మార్లు కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రికి తమ డిమాండ్లకు సంబంధించి వినతి పత్రాలను ఇవ్వడం జరిగిందని అయినా ఈ దిశలో ఎలాంటి చర్యలూ చేపట్టలేదని పేర్కొంది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాల ప్రకారం పెట్రోల్‌ బంక్‌లలో టాయలెట్లు, స్వచ్చమైన తాగునీరు తదితర సదుపాయాలను కల్పించాల్సి ఉందని ప్రస్తుతం పెట్రోల్‌ బంకుల నిర్వహణ పెనుభారంగా మారుతోందని వాపోయింది. 1 శాతం కమీషన్‌ ఇస్తే ఈ సమస్యల నుంచి కొంతమేరకు బయటపడగలమని పేర్కొంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో పదే పదే చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అనేక పెట్రోల్‌ బంకులు నష్టాన్ని చవిచూస్తున్నాయని సమాఖ్య పేర్కొంది. కేంద్రం స్పందించకపోతే పోరాటమే శరణ్యమని తెలిపింది.

Updated Date - 2022-05-27T16:30:12+05:30 IST