ఏపీజీ బ్యాంకు అవినీతి ఆరోపణలపై 27న ధర్నా

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

మండలంలోని బాలతిమ్మయ్యగారిపల్లె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ చేసిన అవినీతిపై, రైతులు చేసిన ఆరోపణలపై ఈనెల 27న మహాధర్నా చేపడుతున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

ఏపీజీ బ్యాంకు అవినీతి ఆరోపణలపై 27న ధర్నా

చక్రాయపేట, జనవరి 21: మండలంలోని బాలతిమ్మయ్యగారిపల్లె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ చేసిన అవినీతిపై, రైతులు చేసిన ఆరోపణలపై ఈనెల 27న మహాధర్నా చేపడుతున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక జనజాగృతి గ్రంథాలయంలో శుక్రవారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌కు, ఏపీజీ బ్యాంకు చైర్మన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్నామని, ధర్నా కార్యక్రమానికి పోలీసు శాఖ అనుమతి కోరుతున్నామని తెలిపారు. బాలతిమ్మయ్యగారిపల్లె ఏపీజీ బ్యాంకులో అవినీతితో పాటు రైతులు, ఖాతాదారుల పట్ల దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడుతున్నారని, రైతుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కొండుగారిపల్లెకు చెందిన రైతు వెంకటనారాయణ ఖాతాలో రూ.60వేలు డిపాజిట్‌ చేయించామని, ఆయనకు అనారోగ్యంతో ఉన్నాడని డిపాజిట్‌ ఇవ్వాలని కోరగా దుర్భాషలాడారని తెలిపారు. సురభి హరిజనవాడకు చెందిన రమణమ్మ ఖాతాలో లక్ష రూపాయల డబ్బులను గల్లంతు చేశారని, అలాగే కె.ఎర్రగుడికి చెందిన సుందరాచారికి రుణం ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని, నిరుద్యోగ యువకులకు ముద్ర లోన్లు రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. రుణం మంజూరైనా బ్రోకర్లు చెబితే తప్ప డబ్బులు ఇవ్వరని తెలిపారు. అందుకే ఈనెల 27వ తేదీన అటు బీజేపీ, ఇటు రైతులు మహాధర్నా చేపడుతున్నామని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST