కస్టమర్ కేర్ పేరిట బ్యాంకు ఖాతా నుంచి రూ.2.30 లక్షలు స్వాహా
ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సిరూర్ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.2.30 లక్షలను పోగొట్టుకున్నాడు.
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
రాయికోడ్, జనవరి 27: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సిరూర్ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.2.30 లక్షలను పోగొట్టుకున్నాడు. గురువారం ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. సిరూర్ గ్రామానికి చెందిన వ్యాపారి ఎస్.ఆరీఫ్ బుధవారం తన మొబైల్ ఫోన్లోని యోనో యాప్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు యత్నించగా బ్యాలెన్స్ చూపలేదు. కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో వెతకగా 9883556696 అనే ఫేక్ నంబర్ డిస్ప్లే కావడంతో కాల్ చేశాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆరీఫ్తో ఫోన్లో మాట్లాడుతూ ఓటీపీని చెప్పించుకుని, ప్లే స్టోర్, ఫోన్ పే యాప్లు ఓపెన్ చేయించినట్టు వివరించారు. ఈ క్రమంలోనే ఆరీఫ్ బ్యాంకు ఖాతా నుంచి మొదట రూ.30 వేలు డ్రా చేసుకున్నారు. అనంతరం రూ. ఒక్కో లక్ష చొప్పున మరో రెండు దఫాలుగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎంతసేపటికీ ఆ డబ్బు తిరిగి బ్యాంకు ఖాతాలో జమ కాక పోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆరీఫ్ గురువారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.