నిజాంసాగర్కు 22,400 క్యూసెక్కుల వరద
ABN , First Publish Date - 2022-08-09T05:38:19+05:30 IST
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వస్తోంది.
నిజాంసాగర్, ఆగస్టు 8 : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి సోమవారం 22,400 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వీఎఆర్ నెంబర్ 5 గేట్లలోని 3 గేట్లను ఎత్తి మంజీరాలోకి వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తినీటి సామర్థ్యం 14 05 అడుగులకు గాను 1404 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 16.752 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోచారం ప్రాజెక్టు మంజీరా వెంట వరద నీరు వస్తూనే ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి గత నెల 22వ తేదీ నుంచి వరద నీటిని మంజీరాలోకి వదులుతున్నారు. నీటిని దిగువకు వదులుతుండటంతో పర్యాటకులు నిజాంసాగర్ నీటిని ఆస్వాదిస్తూ కేరింతలు వేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలన్ని పచ్చని కళతో గార్డెన్లు, చెట్లు ఆహ్లాదకరంగా మారాయి.
పోచారంలోకి 3854 క్యూసెక్కులు
నాగిరెడ్డిపేట : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పోచారం ప్రాజెక్టులోకి మళ్లీ ఇన్ఫ్లో పెరుగుతోంది. వారం రోజులుగా తగ్గిన ఇన్ఫ్లో సోమవారం ఉదయం నుంచి మళ్లీ వస్తోంది. సోమవారం ఉదయం ప్రాజెక్టులోకి 3854 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నట్లు ఎల్లారెడ్డి నీటి పారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు కట్టపై నుంచి పొంగి పొర్లుతూ మంజీరా నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళుతుంది.