వికాస్ దూబే గ్యాంగ్‌లో ఇద్దరిని కాల్చిచంపిన పోలీసులు

ABN , First Publish Date - 2020-07-03T16:58:26+05:30 IST

కాన్పూర్‌లో ఇవాళ తెల్లవారుజామున ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్‌..

వికాస్ దూబే గ్యాంగ్‌లో ఇద్దరిని కాల్చిచంపిన పోలీసులు

కాన్పూర్: కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న రౌడీ షీటర్ వికాస్‌ దూబే గ్యాంగ్ కోసం యూపీ పోలీసులు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ముఠాలోని ఇద్దరు క్రిమినల్స్‌ను కాల్చిచంపినట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పోలీసులపై దూబే గ్యాంగ్ కాల్పులు జరిపి పారిపోయిన కొద్ది గంటలకే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. పోలీసులకు చెందిన ఓ ఆయుధం మృతుల వద్ద లభించిందనీ.. ఆ ఇద్దరూ దూబే గ్యాంగ్ సభ్యులేనని చెప్పేందుకు ఇదే ఆధారమని చెబుతున్నారు. కాన్షీరాం నివాడ గ్రామం వద్ద ఎన్‌కౌంటర్ జరిగినట్టు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ వెల్లడించారు. మృతులను ప్రేమ్ ప్రకాశ్, అతుల్ దూబేలుగా స్థానికులు గుర్తించినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే 47 కాట్రిడ్జిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వికాస్ దూబే సహా తప్పించుకు పారిపోయిన మరో ముగ్గురు క్రిమినల్స్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. దూబే జాడ పసిగట్టేందుకు ఎలక్ట్రానిక్ సర్వైవలెన్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. 

Updated Date - 2020-07-03T16:58:26+05:30 IST