భావ్యమైన ఆలోచన!
ABN , First Publish Date - 2020-05-03T05:30:00+05:30 IST
వయసు చిన్నదే అయినా పెద్ద మనసుతో ఆలోచించింది. విదేశాల్లో ఉంటున్నా స్వదేశంలో ఉన్న అన్నార్తుల బాధలను చూసి చలించింది. అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి 14 ఏళ్ల భావ్యారెడ్డి...
వయసు చిన్నదే అయినా పెద్ద మనసుతో ఆలోచించింది. విదేశాల్లో ఉంటున్నా స్వదేశంలో ఉన్న అన్నార్తుల బాధలను చూసి చలించింది. అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి 14 ఏళ్ల భావ్యారెడ్డి ‘గో ఫండ్ మీ’ పేరిట యాప్ తయారుచేసి విరాళాలు సేకరించి, స్వదేశంలో ఉన్న అన్నార్తులకు నిత్యావసర వస్తువులు అందేలా చేసింది. లాక్డౌన్ మూలంగా నిరుపేదలు, రోజువారి కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. రోజూ టీవీల్లో, పేపర్లో ఆ వార్తలు చూస్తున్న భావ్యారెడ్డి వారికోసం ఏదైనా చేయాలని అనుకుంది. ‘గో ఫండ్ మీ’ పేరుతో ఒక యాప్ను తయారుచేసి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి నుంచి అపూర్వ స్పందన లభించింది. దాదాపు 3లక్షల 34 వేల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఆ డబ్బులతో మంచిర్యాల జిల్లాలోని నజీర్పల్లి గ్రామంలో 200 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందేలా చేసింది.
మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్, రాజీవ్నగర్, గాంధీనగర్, నస్పూర్లోని సంగమల్లయ్యపల్లె, సీతారాంపల్లి గ్రామాల్లో 150 మంది పేద కుటుంబాలను ఆదుకుంది. ఆమె తాత మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి సహకారంతో నిత్యావసర వస్తువులు అందేలా చేసింది. టెనెస్సే రాష్ట్రంలోని జాన్సన్ సిటీలో భావ్యారెడ్డి కుటుంబం స్థిరపడింది. ఆమె తల్లితండ్రులు లావణ్య అవినా్షలు ఇద్దరూ వైద్యులే. అక్కడి జాన్సన్ సిటీ పబ్లిక్ స్కూల్లో భావ్య పదోతరగతి చదువుతోంది. ‘‘ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పేదలు పడుతున్న కష్టాలను చూస్తున్నాను. నా వంతు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ‘గో ఫండ్ మీ’ యాప్ను రూపొందించాను. అమెరికాలో ఉన్న తెలుగు కుటుంబాలు స్పందించి విరాళాలు అందజేశాయి. వాటిని తాతయ్య ఖాతాకు పంపించి అవసరమైన వారికి నిత్యావసర వస్తువులు అందించేలా చేశాను. ఈ యాప్లో దాతల వివరాలు, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఆ విరాళాలతో చేపట్టిన సేవా కార్యక్రమాలను అందరు చూసి తెలుసుకోవచ్చు’’ అని అంటోంది భావ్య. చిన్న వయసులోనే పేదల గురించి పెద్ద మనసుతో ఆలోచిస్తున్న భావ్య ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
-ఎండీ. మునీర్, మంచిర్యాల