తాళాలు పగలగొట్టి.. ఇంట్లోకి దూసుకెళ్లి.. మహిళపై 11 మంది దాడి
ABN , First Publish Date - 2020-07-10T18:24:25+05:30 IST
ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి మహిళపై అమానుషంగా దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్టు పెందుర్తి సీఐ అశోక్కుమార్ తెలిపారు.
ఐదుగురు మహిళలు.. ఆరుగురు పురుషుల నిర్వాకం..
అరెస్ట్ చేసిన పోలీసులు
పెందుర్తి(విశాఖ): ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి మహిళపై అమానుషంగా దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్టు పెందుర్తి సీఐ అశోక్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వేపగుంట దరి ప్రహ్లాదపురంలో ఓ ఇంట్లో నల్ల పావని అనే మహిళ నివాసముంటోంది. ఆ ఇల్లు కోర్టు వివాదంలో ఉంది. అయితే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గిరిశ్బాబు తన అనుచరులతో గురువారం గేటు తాళాలు విరగ్గొట్టి ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. అడ్డుకున్న పావనిపై దాడి చేశారు. ఆ ఇంటిపై తనకు హక్కు పత్రాలు ఉన్నాయని, ఖాళీ చేయాలని ఆమెను బెదిరించారని సీఐ తెలిపారు. ఆమెపై దాడికి పాల్పడిన 11 మందిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారన్నారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.