పక్డో.. పక్డో..
ABN , First Publish Date - 2022-04-09T17:24:58+05:30 IST
డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లను పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టి స్తున్నారు. నగరాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చి
స్మగ్లర్లను పరుగులు పెట్టిస్తున్న పోలీసులు
రాచకొండలో మూడు నెలల్లో 210 మంది అరెస్ట్
10 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
21 మందిపై పీడీయాక్టులు
హైదరాబాద్ సిటీ: డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లను పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టి స్తున్నారు. నగరాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా రాచకొండ కమిషనరేట్ స్పెషల్ పోలీసులు గంజాయి రవాణాపై స్పెషల్గా ఫోకస్ చేశారు. రాత్రి పగలూ తేడాలేకుండా వాహనాల చెకింగ్స్ చేయడంతో పాటు, ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఇస్తున్న విశ్వసనీయ సమాచారంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాల ఆకట్టిస్తున్నారు.
ఏడాది పని 3 నెలల్లోనే..
గతంలో ఒక్క ఏడాదిలో సుమారు 200 మంది స్మగ్లర్స్ను పోలీసులు పట్టుకునేవారు. కానీ, స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాచకొండ పోలీసులు కేవలం 3 నెలల్లోనే 210మంది స్మగ్లర్లను పట్టుకొని రికార్డు సృష్టించారు. వారి నుంచి సుమారు 10క్వింటాళ్లకు పైగా గంజాయి, 6 లీటర్లు హషిష్ ఆయిల్, మరో రూ.10లక్షల విలువైన డ్రగ్స్ను పట్టుకొని టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పట్టుబడిన 210 స్మగ్లర్లలో ఇప్పటికే 21 మందిపై సీపీ పీడీయాక్టులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పట్టుబడుతున్న స్మగ్లర్లలో ప్రధాన సప్లయ్ దారులు, డీలర్స్ మాత్రం పోలీసులకు చిక్కడంలేదు. వారిని కూడా పట్టుకొని కటకటాల్లోకి నెట్టడానికి సీపీ మహేష్ భగవత్ రంగం సిద్ధం చేశారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు.