ముస్లిం గుర్తులను బీజేపీ చెరిపేస్తోంది: మెహబూబా ముఫ్తీ
ABN , First Publish Date - 2022-02-14T01:00:21+05:30 IST
BJP will erase all Muslim symbols says Mehbooba Mufti on Hijab row
న్యూఢిల్లీ: ముస్లిం గుర్తులన్నింటినీ చెరిపేయాలని బీజేపీ చూస్తోందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆమె స్పందిస్తూ, హిజాబ్తో బీజేపీ ఆగదనే భయం తనకు ఉందని, ముస్లింలకు చెందిన ఇతర గుర్తుల జోలికి కూడా వస్తారని, అన్నింటినీ చెరిపేస్తారని ఘాటుగా విమర్శించారు.
కర్ణాటకలో మొదలైన హిబాజ్ వ్యవహారం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకూ పాకుతుండటంతో హిజాబ్ వివాదం ముదురుతోంది. దీనిపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణ ముగిసేంత వరకూ విద్యాసంస్థల ప్రాంగణాల్లో ధార్మిక దుస్తులు ధరించొద్దని కర్ణాటక విద్యార్థులకు సూచించింది. హిజాబ్, కాషాయ కండువాలు ధరిస్తామని ఒత్తిడి తెస్తే ప్రజలను రెచ్చగొట్టినట్టు అవుతుందని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కాలేజీలు, స్కూళ్లు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. హిజాబ్ వ్యవహారం కర్ణాటక హైకోర్టు ముందున్నందున తొలుత కేసును విచారించి తగు నిర్ణయం తీసుకోవాలని, ఆ తర్వాతే కేసు బదిలీ అంశం పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.