అర్ధరాత్రి నగ్నంగా పరుగులు..
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:08 AM
తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శంకర్నగర్లో 25 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది.
కొద్దిసేపటికే చెరువులో శవమై తేలిన యువతి
పీర్జాదిగూడ, జూలై 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శంకర్నగర్లో 25 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా పరుగులు తీసిన యువతి, కొద్ది సేపటికే పీర్జాదిగూడ చెరువులో శవమై తేలింది. ఏపీలో ని విజయనగరం జిల్లా దేవులపల్లి గ్రామానికి చెందిన వక్కలగడ్డ తేజస్విని(25) తన తల్లి అరుణ(52)తో కలిసి శంకర్నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె గతంలో బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. శనివారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో తేజస్విని తన తల్లిని ఇంట్లో ఉంచి బయట తాళం వేసి నగ్నం గా వీధుల్లో పరుగులు తీసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అనంతరం సమీపంలోని ఆలయానికి వెళ్లి అక్కడి విగ్రహాన్ని, చీరను తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత పీర్జాదిగూడ చెరువులో తేజస్విని మృతదేహం తేలుతూ కనిపించింది. కాగా, తన కుమార్తె కొన్నాళ్లుగా భయాందోళనతో వ్యవహరిస్తున్నట్టు ఆమె తల్లి చెప్పారు.