తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్కు బడ్జెట్ ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Sep 18 , 2026 | 08:20 PM
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశంపై బీజేపీ నేతలు మాట్లాడటం మానుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. ప్రాజెక్టు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించామని, ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, బడ్జెట్లోనే కేటాయింపులు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ముందుకు సాగాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని.. కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తోందని చెప్పారు. నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర అంశాలపై సంబంధిత ప్రభుత్వాలు, సంస్థలతో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో తుమ్మిడిహెట్టి అంశంలోనూ సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
Also Read:
ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్పాల్ సింగ్
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..