Telangana: జైళ్లలో 12శాతం పెరిగిన ఖైదీలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:51 AM
రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో 11.8 శాతం పెరిగిందని జైళ్లశాఖ 2025 వార్షిక నివేదిక పేర్కొంది. ఈ నివేదికను చంచల్గూడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా విడుదల చేశారు.
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో 11.8 శాతం పెరిగిందని జైళ్లశాఖ 2025 వార్షిక నివేదిక పేర్కొంది. ఈ నివేదికను చంచల్గూడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా విడుదల చేశారు. ఐజీలు మురళీబాబు, రాజేష్, డీఐజీలు శ్రీనివాస్, సంపత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వార్షిక నివేదికలోని కీలకాంశాలు..
2024లో జైళ్లలో ఖైదీలు 38,079 మంది ఉండగా, 2025లో 11.8 శాతం పెరిగి 42,566కు చేరింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుకు వచ్చినవారు 2,833 మంది ఉన్నారు. వారిలో ఒక మహిళ ఉంది. ఈ కేసుల్లో ఖైదీల సంఖ్య 152ు పెరిగింది. తర్వాతి స్థానంలో సైబర్ నేరాల ఖైదీల్లో 135.6 శాతం పెరుగుదల ఉంది. జైళ్లలో 1,784 మంది సైబర్ నేరగాళ్లు ఉన్నారు.
గత ఏడాది జైళ్లకు వచ్చినవారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వయస్సు వారు ఉండగా ఈ వయస్సు ఖైదీల్లో 13.31శాతం పెరుగుదల నమోదైంది.
2025లో జైళ్లకు వచ్చినవారిలో మొదటిసారి నేరాలు చేసినవారు 40,090 మంది, రిపీడెట్ అఫెండర్స్ 2,496 మంది ఉన్నారు. విదేశాలకు చెందిన ఖైదీలు 2024లో 107 మంది ఉండగా 2025లో 74కు తగ్గింది.
మత్తుపదార్థాలకు బానిసైన 2,915 మంది ఖైదీల్లో డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స ద్వారా 590 మందిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు.
సెక్యూరిటీ బాండ్ సమర్పించలేక జైళ్లలోనే మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు ఆర్థికసాయం అందించి, 18 మంది జైళ్ల నుంచి విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని సౌమ్యా మిశ్రా తెలిపారు.