Share News

ఆవిష్కరణల కేంద్రం

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:07 AM

ఇప్పటిదాకా ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ ఇక కొత్త ఔషధాల వినూత్న ఆవిష్కరణ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ఆవిష్కరణల కేంద్రం
BioAsia 2026

  • జీవ విజ్ఞానం, ఔషధాలు, వైద్యంలో ప్రపంచ అగ్రగామిగా తెలంగాణ

  • ప్రజారోగ్యానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు.. బయో ఆసియా 2026 సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

  • ప్రొఫెసర్‌ బ్రూస్‌కు జీనోమ్‌ వ్యాలీ అవార్డు ప్రదానం.. హైదరాబాద్‌లో ఒపెలా హెల్త్‌కేర్‌ జీసీసీ ఏర్పాటుకు నిర్ణయం

  • ట్రెడెన్స్‌ హైదరాబాద్‌ జీసీసీ విస్తరణకు అంగీకారం.. జీనోమ్‌ వ్యాలీలో వాక్సిండో పశువుల వ్యాక్సిన్ల తయారీ

  • 12 ఎకరాల్లో ఆరెక్స్‌ ప్రొపెల్లెంట్‌ ల్యాబ్‌ ఏర్పాటు.. ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఇప్పటిదాకా ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ ఇక కొత్త ఔషధాల వినూత్న ఆవిష్కరణ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఔషధ పరిశోధనలకు, ఏఐ ఆధారిత వైద్య సేవలకు హైదరాబాద్‌ చిరునామాగా మారబోతోందని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇప్పటికే లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల్లో తెలంగాణ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు, విదేశీ పెట్టుబడులు, సంయుక్త ఆవిష్కరణలతో దూసుకుపోతోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా-2026 సదస్సును మంగళవారం హైటెక్స్‌లో ఆయన ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో మొదటి రోజు వివిధ దేశాల బయో టెక్నాలజీ, ఫార్మా మెడ్‌టెక్‌, డిజిటల్‌ హెల్త్‌, పరిశోధన, పెట్టుబడులు, విధాన రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొత్త తరం లైఫ్‌ సైన్సెస్‌ విధానం(2026-30)తో తెలంగాణ భవిష్యత్తుకు చక్కటి ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య పరిష్కారాలుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


ఈ పాలసీ రాష్ట్రంలో స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో ఈ రంగంలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు కలిసి కొత్త ధోరణులు, సవాళ్లపై చర్చించి భవిష్యత్తు వ్యాపార అవకాశాలను రూపుదిద్దుకునే కీలక వేదికగా ఈ సమావేశం నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ జీన్‌ థెరపీ రంగంలో విశిష్ట కృషి చేసిన యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎల్‌ లెవిన్‌కు ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌ కుమార్‌, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈవో శక్తి నాగప్పన్‌ ప్రసంగించారు. ఏఐ ఆటోమేషన్‌, డేటా సైన్స్‌లు జీవశాస్త్రంతో సమన్వయం బయో ఆసియా 2026లో ఏఐ, ఆటోమేషన్‌, డేటా సైన్స్‌లను జీవశాస్త్రంతో సమన్వయం చేస్తూ ఆరోగ్య రంగంలో వచ్చే తదుపరి విప్లవంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ కలయిక ఔషధఆవిష్కరణ, రోగ నిర్ధారణలు, చికిత్సలు, బయోతయారీ, ఆరోగ్య సంరక్షణ సేవలను ఆందించడంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం కల్పిస్తోంది. టెక్‌ బయో అన్‌లీ్‌షడ్‌, ఏఐ ఆటోమేషన్‌, బయాలజీ రివల్యూషన్‌ అంశాలపై జరుగుతున్న సదస్పులో శాస్త్రీయ పురోగతులను స్పష్టమైన ఆరోగ్య పరిష్కారాలుగా మార్చి, రోగి సంరక్షణను మెరుగుపరచడం, స్థిరమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను పెంపొందించడంపై చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రెండు దశాబ్దాలుగా ఏటా నిర్వహిస్తూ వస్తున్న ఈ సదస్సుతో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో భాగస్వామ్యాలను పెంపొందించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, పురోగతిని వేగవంతం చేయడం కోసం ఒక ప్రపంచ స్థాయి వేదిక రూపుదిద్దుకుందని అధికారులు అంటున్నారు.


ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు

సదస్సు సందర్భంగా లైఫ్‌ సైన్సెస్‌ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ అయిన ఒపెలా హెల్త్‌కేర్‌ 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీని ఏర్పాటు చేసి త్వరలోనే కార్యకలాపాలు విస్తరించనుంది. ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పించనుంది. ఇండోనేసియా కంపెనీ జేఏపీఎ్‌ఫఏ అనుబంధ సంస్థ వాక్సిండో యానిమల్‌ హెల్త్‌కేర్‌ హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీలో అత్యాధునికమైన బీఎ్‌సఎల్‌-3 వ్యాక్సిన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కోళ్లు, పశువులు, పందులు, జలసంపదకు అవసరమైన వ్యాక్సిన్లను తయారు చేస్తుంది. ప్రముఖ ఏఐ డేటా సైన్స్‌ కంపెనీట్రెండెన్స్‌ ఇంక్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఏఐ ఆధారిత హెల్త్‌ కేర్‌ లైఫ్‌ సైన్సెస్‌ కార్యకలాపాలను విస్తరించనుంది. 18 వేల చదరపు అడుగుల ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ సంస్థ జినోమ్‌ వ్యాలీలో భారీ లైఫ్‌ సైన్సెస్‌ క్యాంప్‌సను ఏర్పాటు చేయనుంది. 12 ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ పరిశోధన కేంద్రం రానుంది.


ఈ వార్తలు కూడా చదవండి

9 నెలల్లో ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే!

Updated Date - Feb 18 , 2026 | 06:19 AM