చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:57 PM
గతేడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల చలాన్లు విధించారు. ఇందులో వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు 10,27,335 ఉండగా, ఈ-చలాన్లు 25,93,152 ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదంది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా.. గత సంవత్సరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల చలాన్లు విధించారు. ఇందులో వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు 10,27,335 ఉండగా, ఈ-చలాన్లు 25,93,152 ఉన్నాయి. ఈ రెండు రకాల చలాన్ల మొత్తం విలువ రూ. 239.37 కోట్లు అని వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.
కొద్దిరోజుల క్రితం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అరైవ్-అలైవ్ పేరుతో ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు వేయగానే.. వారి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం ఆటోమెటిక్గా చెల్లింపు జరిగిపోయేలా సరికొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి.. కారణమేంటో తెలుసా?
బీరు బాటిళ్లతో ఇలా ఎవరైనా చేస్తారా.. 282 అడుగుల ఎత్తైన బిల్డింగ్పై..