ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 18 , 2026 | 09:57 PM
ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, జులై 18: ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టేందుకు రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి జి. చిన్నారెడ్డిని ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ను కమిటీ కన్వీనర్గా నియమించిన ప్రభుత్వం, పలు రంగాలకు చెందిన నిపుణులను సభ్యులుగా చేర్చింది.
ఈ కమిటీ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనే కాకుండా మండల, గ్రామ స్థాయిల వరకు కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించనుంది. కరవు పరిస్థితులను నివారించడం, రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించే అనుసరణ చర్యలపై ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేయనుంది. అలాగే అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఐక్రిశాట్), భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీయూ) సహా పలు ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రైతులకు నష్టం తగ్గించే దిశగా ఈ కమిటీ పనిచేయనుంది.
ఈ వార్తలనూ చదవండి:
వీకెండ్ ట్రిప్కు కొత్త ట్రెండ్.. హైదరాబాద్లో కారవాన్ బుకింగ్స్ జోరు
వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లు ఇవే.!