170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో అమరే చీర..
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:34 AM
మగ్గం వారి లోకం.. చేనేత వారికి జీవనాధారం.. మరమగ్గాల మధ్య చేనేత మగ్గం మూగబోతుండగా చేనేత కళను బతికించేందుకు కొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వస్త్రోత్పత్తి కేంద్రంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
సిరిసిల్ల (ఆంధ్రజ్యోతి): మగ్గం వారి లోకం.. చేనేత వారికి జీవనాధారం.. మరమగ్గాల మధ్య చేనేత మగ్గం మూగబోతుండగా చేనేత కళను బతికించేందుకు కొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వస్త్రోత్పత్తి కేంద్రంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పంతో చేనేత మగ్గంపై ఒక రోజంతా నేసే చీరను 170 నిమిషాల్లో (2 గంటల 50 నిమిషాలు) సోమవారం నేసి రికార్డు సృష్టించారు. అగ్గిపెట్టెలో అమరే విధంగా ఐదున్నర మీటర్ల పొడవు, 42 అంగుళాల వెడల్పు, 175 గ్రాముల బరువున్న చీరను ప్రత్యేక నైపుణ్యంతో నేశారు.
చీర తయారీలో సుమారు 10,500 పోగుల వెఫ్ట్, 500 వార్పు పోగులు ఉపయోగించి మరమగ్గం వేగానికి ఏమాత్రం తీసిపోకుండా సంప్రదాయ చేనేత మగ్గంపైనే చీరనేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో హరిప్రసాద్ చేసిన అరుదైన ప్రయత్నాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రతినిధులు బొల్లి రాంమోహన్, మండల సత్యం, మోర రవి, బాలయ్య, పూర్లచందర్ తదితరులు అభినందించి, ఆయనకు సన్మానం చేశారు.
ఇవి కూడా చదవండి
అనాథనని చెప్పి.. ప్రేమ పేరుతో దగ్గరై!
6 నుంచి దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్