ఒంటరి మహిళల ధ్రువీకరణ సులభతరం ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకూ అధికారం: సర్కారు
ABN , Publish Date - Sep 12 , 2026 | 02:23 AM
చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నేపథ్యంలో ఒంటరి మహిళలకు సంబంధించిన ధ్రువీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది.
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నేపథ్యంలో ఒంటరి మహిళలకు సంబంధించిన ధ్రువీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఒంటరి మహిళల భర్త విడిపోయిన కాలవ్యవధి (విడిపోయిన కాలం)కి సంబంధించి అవసరమైన పత్రాలు అందుబాటులో లేనిపక్షంలో విచారణ జరిపి ధ్రువీకరించేందుకు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు కూడా అధికారం కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య దేవరాజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు కేవలం తహసీల్దార్కు మాత్రమే పరిమితమైన ఈ విచారణ ధ్రువీకరణ అధికారాలను ఇప్పుడు గ్రామీణులకు ఎంపీడీఓ (మండల పరిషత్ అభివృద్ధి అధికారి), పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ లేదంటే డిప్యూటీ కమిషనర్కు కల్పించినట్లు అందులో పేర్కొన్నారు. ఒంటరి మహిళలు దరఖాస్తుల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ కీలక మార్పులు చేసినట్లు దివ్య వెల్లడించారు. కాగా, పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15తో ముగియనుంది.