Share News

బిగ్‌ ట్విస్ట్‌.. కాంగ్రెస్‌లో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు..

ABN , Publish Date - Feb 15 , 2026 | 09:21 PM

ఇద్దరు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ కార్పొరేటర్లతో పాటు, ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

బిగ్‌ ట్విస్ట్‌.. కాంగ్రెస్‌లో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు..
Karimnagar corporation

కరీంనగర్‌ కార్పొరేషన్‌ విషయంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ కార్పొరేటర్లతో పాటు, ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి విజయం సాధించిన కార్పొరేటర్లు సాయిజ్యోతి, శ్యామలతో పాటు స్వతంత్ర కార్పొరేటర్లు కొమరయ్య, నందిని ఉదయ్‌, మల్లేశం తదితరులు హస్తం గూటికి చేరారు.


కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. ‘ కరీంనగర్‌ అభివృద్ధి అధికార కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నాము. అభివృద్ధి కాంక్షించి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాము’ అని అన్నారు. కాగా, నిన్న (శనివారం) ఎంపీ బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీకి హ్యాండ్‌ ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు.


ఉత్కంఠ పరిస్థితి..

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా బీజేపీ 30, కాంగ్రెస్‌కు 14, బీఆర్‌ఎస్‌కు 9, ఎంఐఎంకు 3 దక్కాయి. ఫార్వర్డ్‌ బ్లాక్‌కు 2, స్వతంత్రులు 8 మంది విజయం సాధించారు. ఇక్కడ మేయర్‌ పీఠాన్ని సాధించాలంటే 35 మంది సభ్యుల బలం కావాలి. 30 సీట్లు సాధించి కరీంనగర్‌ కార్పొరేషన్‌ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తమకే మేయర్‌ పీఠం దక్కుతుందని భావించింది. కానీ, స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే..

Updated Date - Feb 15 , 2026 | 10:06 PM