గర్భిణి, గర్భస్థ శిశువు ప్రాణాలకు ఖరీదు!
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:20 AM
రెండు ప్రాణాల ఖరీదు రూ.8.50 లక్షలు. గర్భిణి, గర్భస్థ శిశువు ప్రాణాలకు కట్టిన వెల ఇది. జనగామలో అక్రమ అబార్షన్ కారణంగా గర్భిణి మృతి చెందిన డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. ఈ నెల 25న గాంధీ ఆస్పత్రిలో గర్భిణి శ్రావణి మృతి చెందిన తర్వాత పలువురు..
కేసు పెట్టొద్దంటూ మృతురాలి భర్తతో ఒప్పందం
డబ్బు చెల్లింపులో తేడాలతో నిందితులపై భర్త ఫిర్యాదు
జనగామ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రెండు ప్రాణాల ఖరీదు రూ.8.50 లక్షలు. గర్భిణి, గర్భస్థ శిశువు ప్రాణాలకు కట్టిన వెల ఇది. జనగామలో అక్రమ అబార్షన్ కారణంగా గర్భిణి మృతి చెందిన డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. ఈ నెల 25న గాంధీ ఆస్పత్రిలో గర్భిణి శ్రావణి మృతి చెందిన తర్వాత పలువురు పెద్ద మనుషులు రంగంలోకి దిగి సెటిల్మెంట్కు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ విషయమై కేసు పెట్టొద్దంటూ మృతురాలి భర్త భాస్కర్గౌడ్, తల్లి శోభతో ఆర్ఎంపీ శ్రావణ్, స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్, నర్సు అనసూయ ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేసినట్లు ప్రచారం సాగుతోంది. పెద్ద మనుషుల సమక్షంలో గర్భిణి, గర్భస్థ శిశువు ప్రాణాలకు రూ.8.50 లక్షలు చెల్లించేందుకు అంగీకారం కుదరినిట్లు సమాచారం.
దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.50వేలు ఇవ్వగా, రెండు రోజుల్లో మిగతా డబ్బులు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఈ డబ్బును మృతురాలి ఇద్దరు కూతుర్ల పేరుపై ఎఫ్డీ చేయాలని నిర్ణయించారు. అయితే, డబ్బుల చెల్లింపులో తేడాలు రావడంతో నిందితులపై మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా, గర్భిణి మృతి కేసుపై వరంగల్ సీపీ శ్వేత సీరియ్సగా ఉన్నారు. లింగ నిర్ధారణ, అబార్షన్, గర్భిణి మృతి అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో లోతైన విచారణ చేయాలని ఆమె పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు నేడో, రేపో నిందితులను అరెస్టు చేయనున్నట్లు తెలిసింది.