Share News

రౌడీ షీటర్‌‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్

ABN , Publish Date - May 05 , 2026 | 06:23 PM

ఓ సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న రౌడీ షీటర్‌ను తన ఆటో సాయంతో అడ్డుకున్నాడు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా అతడిని పట్టుకున్నాడు. రౌడీ షీటర్ అరెస్ట్ అవ్వడానికి ఎంతో కృషి చేశాడు.

రౌడీ షీటర్‌‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్
auto driver bravery

హైదరాబాద్, మే 5: ఓ సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న రౌడీ షీటర్‌ను తన ఆటో సాయంతో అడ్డుకున్నాడు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా అతడిని పట్టుకున్నాడు. రౌడీ షీటర్ అరెస్ట్ అవ్వడానికి ఎంతో కృషి చేశాడు. ఆటో డ్రైవర్ ధైర్యసాహసాలకు సరైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆటో డ్రైవర్‌ను సన్మానించారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు.


హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్ద ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా ఆ దృశ్యాన్ని చూశాడు. వెంటనే ఆటోను రివర్స్ చేశాడు. రౌడీ షీటర్ స్కూటీని పైకి లేపి అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. జాహెర్ ఆటోతో స్కూటీని ఢీకొట్టాడు.


దీంతో మహ్మద్ సోహేల్ కిందపడిపోయాడు. జాహెర్ వెంటనే కిందకు దిగి సోహేల్‌ను పట్టుకున్నాడు. తర్వాత అటు వైపు వెళుతున్న వారు కూడా జాహెర్‌కు సాయం చేశారు. రౌడీ షీటర్‌ను పోలీసులకు పట్టించారు. అనంతరం జాహెర్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఎలాంటి ప్రతిఫలం ఆలోచించకుండా.. తన ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను పోలీసులకు పట్టించిన జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్‌, టీజీఐసీసీసీలోని తన ఛాంబర్‌లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జీ చంద్ర మోహన్, గోషామహల్ ఎస్‌హెచ్‌ఓ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేశారు.. టీఎంసీపై మనోజ్ తివారి సంచలన ఆరోపణలు

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్

Updated Date - May 05 , 2026 | 06:32 PM