ఉప్పల్లో నేడు సీఎం రేవంత్ పర్యటన.. రూ. 1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:29 AM
హైదరాబాద్ నగర శివార్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
హైదరాబాద్, జూన్ 07: నగర శివార్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కీలక సమస్యలను తీరుస్తూ, రికార్డు స్థాయిలో మొత్తం రూ.1,511 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. స్థానికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన నూతన మల్కాజ్గిరి మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగుతున్న రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం రోడ్డు నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏఓసి (AOC) సెంటర్ పరిధిలో ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ.. ఏకంగా రూ.960 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు ఎల్బీనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తప్పించేలా, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద రూ.416 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు కూడా ఇక్కడే శ్రీకారం చుట్టనున్నారు. అలాగే.. పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే క్రమంలో రూ.37.50 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న మల్కాజ్గిరి జిల్లా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
Read Latest AP News And Telugu News